కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్
అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాలని తమ కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. అమరావతిలోని మంగళగిరి సమీపం చినకాకానిలోని మయూరి టెక్ పార్క్ భవనం ఐదో అంతస్తులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు( APEDB) నూతన కార్యాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీ ఎమ్.అభిషిక్త్ కిషోర్, ఉన్నతాధికారులు ఎంటీ కృష్ణబాబు, సౌరభ్ గౌర్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీ, లాజిస్టిక్, తదితర రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఇక్కడ కొలువు తీరేలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలుకుతోందన్నారు. గత సర్కార్ ఉద్యోగాల కల్పన విషయంలో నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. కానీ తమ కూటమి సర్కార్ వచ్చాక పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అవుతున్నాయని, ప్రత్యేకించి ఐటీ సెక్టార్ లో శిక్షణ ఇచ్చి జాబ్స్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.





