బీఆర్ఎస్ ఆరోపణల్లో వాస్తవం లేదన్న సీఎం
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదంటూ హితవు పలికారు బీఆర్ఎస్ పార్టీకి. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, తదితరులంతా తనను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. వాళ్లకు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, జనం అందుకే ఛీ కొట్టారని, అయినా బుద్ది రావడం లేదన్నారు సీఎం. అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను ఎంజాయ్ చేయడానికి లేదా షాపింగ్ చేసేందుకు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లడం లేదన్నారు.
విచిత్రం ఏమిటంటే తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రి వర్గ విస్తరణ అంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరికాదన్నారు. పాలనా పరంగా డిల్లీకి వెళ్లడానికి అనేక కారణాలు, అంశాలు ఉంటాయన్నారు. పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ ఇస్తున్నందుకు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పువ్వులు పెట్టుకున్నారు అంటూ సీఎం ఎద్దేవా చేశారు. రాబోయే పదేళ్ల పాటు తానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటానని జోష్యం చెప్పారు. ఇక కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న సొమ్మంతా కక్కిస్తానని ప్రకటించారు. వాళ్లు జైలుకు వెళ్లడం పక్కా అని తేల్చారు.






