ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ,
అమరావతి : ఏపీ రాష్ట్రాన్ని వర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. భారీ ఎత్తున పలు జిల్లాల్లో చేతికి వచ్చిన పంటలు నేల రాలాయి. పంట నష్టంపై అంచనాలు తయారు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పంటలు కోల్పోయిన అన్నదాతలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా ఇవాళ కీలక ప్రకటన చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి, పోలవరం,విశాఖ, అనకాపల్లి,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు ,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటపుడు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని పేర్కొంది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది.






