శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను అభినందించారు. ఇదే సమయంలో కీలక ప్రకటన చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి పది లక్షలకు పెంచాం అన్నారు. సీపెక్ సర్వే ప్రకారం తేలిన కుటుంబాలన్నింటికీ రూ. 5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడొద్దని భావనతో కుటుంబ బీమా తీసుకొచ్చాం అని తెలిపారు సీఎం. సోమవారం శాసన మండలిలో ప్రసంగించారు.
విద్యుత్, సింగరేణి కార్మికులకు రూ. కోటి పైన ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం జరిగిందని చెప్పారు.
విద్యుత్ శాఖలో పని చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓర్సు సురేశ్, ముక్తార్ బేగ్ కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున చెక్కులు ఇవ్వడం ఒక బాధ్యతగా భావించామన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు జోన్లుగా విభజించాం అన్నారు. ఔటర్ రింగురోడ్డు ఇన్ సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా మారుతుందన్నారు.





