అసెంబ్లీలో నిలదీసిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : సర్కార్ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ మనుగడపై ప్రశ్నించారు.. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సభలో గుర్తుచేశారు. మొన్నటి గవర్నర్ ప్రసంగంలో మహిళల ఉచిత ప్రయాణం వల్ల రూ. 9,200 కోట్లు ఆదా అయిందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందా లేదా అన్నది తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఒకవేళ ఇంకా చెల్లించక పోతే, ప్రభుత్వం ఆర్టీసీకి ఎంత బాకీ ఉందో మంత్రి స్పష్టంగా చెప్పాలన్నారు.
ప్రస్తుతం ఆర్టీసీ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? ఒకవేళ సంస్థ లాభాల్లోనే ఉంటే.. కార్మికులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్, ఏరియర్స్, సీసీఎస్ బకాయిలను ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ డ్యూ ఉండి మూడేళ్లు అవుతోందన్నారు. వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ కొత్త పీఆర్సీని ఎప్పటినుంచి అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.





