స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టులు ఏపీ సర్కార్ కు సహకరించాలని కోరారు. ఉమ్మడి ఏపీలో మండల రిపోర్టర్లకు అక్రిడేషన్లు ఇవ్వడం తెలుగుదేశం హయాంలోనే మొదలైందని చెప్పారు. జర్నలిస్టులకు నాడు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు కూడా చేశాం అని గుర్తు చేశారు సీఎం. జర్నలిస్టుల మీద దాడులు జరిగితే విచారణకు జిల్లాలో ఎస్పీ స్థాయిలో కమిటీ విచారించేలా నిబంధనలు తెచ్చాం అన్నారు. 2014 తరువాత డెస్క్ జర్నలిస్టులకు, సబ్ ఎడిటిర్లకు అక్రిడేషన్లు, బస్సు ప్రయాణంలో రాయితీలు కల్పించడం జరిగిందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
2014-19 మధ్య జర్నలిస్టులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించామని, కానీ గతంలో ఏపీలో కొలువు తీరిన జగన్ మోహన్ రెడ్డి వైసీపీ సర్కార్ వచ్చాక తీసి వేశారంటూ ఆరోపించారు సీఎం. తాము 2018లో 20 వేల అక్రిడేషన్లు ఇస్తే… గత ప్రభుత్వం వాటిని సగానికి తగ్గించిందని మండిపడ్డారు. అర్హులందరికీ అక్రిడేషన్లు ఇస్తాం అని ప్రకటించారు. హైదరాబాద్ లో మంత్రుల క్వార్టర్ల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా ప్రెస్ క్లబ్ కు ఇచ్చాం అన్నారు. అమరావతిలో ఐజేయూ కార్యాలయానికి స్థలం ఇచ్చే అంశాన్ని సబ్ కమిటీకి అప్పగిస్తామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.





