నిప్పులు చెరిగిన మంత్రి సవిత
శ్రీ సత్యసాయి జిల్లా : మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి ఎస్. సవిత. ఆర్డీటీ విషయంలో
క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబును, కూటమి ప్రభుత్వానుద్దేశించి జగన్ తరుచుగా విమర్శించడంపై తీవ్రంగా మండిపడ్డారు. విధ్వంసం చేయడం, దోచుకోవడం జగన్ క్రెడిట్ అని విమర్శించారు. అటువంటి జగన్ క్రెడిట్ ను తాము చోరీ చేయాల్సిన దుస్థితి పట్టలేదన్నారు. తమదంతా అభివృద్ధి పథమన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఎంతో కీలకమైన అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ జరిగినా జగన్ పట్టించుకోలేదన్నారు. ఆయనకు రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఈ ఘటనే చిన్న ఉదాహరణ అని మంత్రి సవిత అన్నారు.
పెనుకొండలో జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే జరిగినవని మంత్రి సవిత తెలిపారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో పెనుకొండలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. వైసీపీ వలస పక్షులు దోచుకోవడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కేవలం 22 నెలల కాలంలో పెనుకొండ నియోజక వర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. పీఆర్ డిపార్ట్ మెంట్ ద్వారా రూ.72 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. నియోజక వర్గ వ్యాప్తంగా పరిశుద్ధమైన తాగునీటి సరఫరా కోసం గ్రామీణ నీటిపారుదల విభాగం ద్వారా రూ.32 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని పనులు జరుగుతున్నాయని తెలిపారు.





