కుమార స్వామి కేంద్ర మంత్రిగా ఉండటం భేష్
కర్ణాటక : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్ణాటక లోని సింధనూరు హోసళ్లీ క్యాంప్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయ సైనిక్ స్కూల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ తో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ తో కలిసి ప్రారంభించారు . అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు నారా లోకేష్ బాబు. కర్ణాటక సంస్కృతి, సంప్రదాయం అత్యంత గొప్పదని ప్రశంసలు కురిపించారు.
సైనికుల ప్రాణ త్యాగాలు మనం ఎప్పటికీ మర్చి పోకూడదన్నారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. అలా ఉంటేనే అభివృద్ధి సాధించ వచ్చన్నారు నారా లోకేష్. కుమార స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఆయన కాపాడారని, ఇందుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రిగా ఉండటం మన అదృష్టం అన్నారు. తనకు ఎల్లప్పుడూ మనం అండగా ఉండాలని కోరారు మంత్రి.






