అంగరంగ వైభవంగా స్వామి వారి ధ్వజారోహణం
ఒంటిమిట్ట / తిరుపతి జిల్లా : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. నిన్న రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం వైభవోపేతంగా నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్య పదవుల వంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .
ఇదిలా ఉండగా ప్రతి ఏటా శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు స్వామి, అమ్మ వార్లకు సమర్పిస్తున్నారు. ఈ ఏడాది ఒంటిమిట్ట కేంద్రంగా జరిగిన సీతా రాముల కల్యాణం కమనీయంగా సాగింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులతో పాటు మంత్రి నారా లోకేష్, భార్య బ్రాహ్మణి, కొడుకు హిమాంశు హాజరయ్యారు. స్వామి, అమ్మ వార్ల కృపకు పాత్రులయ్యారు. టీటీడీ ఈ ఏడాది నుంచే నిత్య అన్నదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సీఎం ఆదేశాల మేరకు. ఈ సారి కళ్యాణోత్సవానికి 80 వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ప్రశాంతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.






