నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత
విజయవాడ : ఏపీ బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకిపారేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. విలేకరుల అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత స్పందిస్తూ సీఎం చంద్రబాబుకు సినిమా చూపేంత సీన్ జగన్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. పాదయాత్ర కాకపోతే జగన్ పొర్లు దండాలు చేసుకోవాలని సూచించారు. ఆయన్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రతిపక్షంలో అమరావతికి అంగీకరించారని, తర్వాత మూడు ముక్కలాట ఆడారని, ఇప్పుడు మావిగన్ అంటూ మరో డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. అమరావతి ప్రాంత రైతులను, మహిళలను జగన్ తీవ్ర ఇబ్బందుల పాల్జేశారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్, ఆయన బ్యాచ్ ఎన్నో కుట్రలు పన్నారని మంత్రి సవిత మండిపడ్డారు.
ఇదే సమయంలో చేనేతన్నలకు తీపి కబురు చెప్పారు మంత్రి. ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులకు ఆఖరు గడువు అని స్పష్టంచేశారు. లబ్ధిదారుల ఎంపిక నిర్లక్ష్యం చూపొద్దని, పొరపాట్లు జరిగితే ఆయా జిల్లాల డీవోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి సవిత స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, లబ్ధిదారులకు చేనేత, జౌళి శాఖాధికారులు వారధిగా ఉండాలన్నారు. చేనేతలకు మేలు చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఇప్పటికే చేనేతలకు లబ్ధి కలిగించేలా వ్యక్తిగత పథకాలు ప్రారంభించామన్నారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నామన్నారు.





