తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ సుబ్బారాయుడు
తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరించారు .పోలీసు, ట్రాఫిక్, టిటిడి విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నాయని, భక్తులు కూడా సహకరించాలని కోరారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో కొందరు ఆటో డ్రైవర్లపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని, అవసరమైతే ఆటోలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
భక్తులు సురక్షిత వాతావరణంలో దర్శనం చేసుకుని వెళ్లేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొందరి ప్రవర్తన వల్ల తిరుపతికి చెడ్డపేరు రాకుండా చూడాలని సూచించారు. భక్తులను మోసం చేసే తప్పుడు సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని టిటిడి సివిఎస్వో కె.వి. మురళీకృష్ణ సూచించారు. టిటిడి అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, మోసపూరిత చర్యలపై టిటిడి విజిలెన్స్కు సమాచారం అందించాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన క్యూలైన్లు, భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని, జిల్లా పోలీసులు ,టిటిడి విజిలెన్స్ విభాగాలు సమిష్టిగా పనిచేస్తున్నాయని తెలిపారు.







