సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ సూర్యవంశీ
జైపూర్ : ఐపీఎల్ 19వ సీజన్ లో దుమ్ము రేపాడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. తను అత్యధిక సిక్సర్లతో రికార్డ్ సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అంతే కాదు రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఐపీల్ లో అరుదైన ఘనత సాధించాడు. ఇదిలా ఉండగా వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యేకించి తనను ఎంపిక చేసిన రాహుల్ ద్రవిడ్ కు, మాజీ కెప్టెన్ సంజు శాంసన్ తో పాటు ప్రస్తుతం తనను అక్కున చేర్చుకుని, ఆదరిస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యానికి రుణపడి ఉంటానని అన్నాడు.
టీం యాజమాన్యానికి నేను నిజంగా ఎంతో కృతజ్ఞుడిని. రెండేళ్ల క్రితం, వారు నన్ను విశ్వసించి తమ జట్టులోకి తీసుకున్నారు. RR యాజమాన్యం నా జీవితాన్ని, అలాగే నా కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. రెండేళ్ల క్రితం నా దగ్గర పెద్దగా ఏమీ ఉండేది కాదు, కానీ ఈ రోజు నా దగ్గర అన్నీ ఉన్నాయి. RR యాజమాన్యానికి నేను అత్యంత రుణపడి ఉంటాను. వారి సహకారం లేకపోతే, నేను ఈ స్థాయికి చేరుకోగలిగే వాడిని కాదన్నాడు వైభవ్ సూర్యవంశీ.






