నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో చట్టవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అచ్చెన్నాయుడు విమర్శించారు. అధికార మదంతో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన పాలన చివరకు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేసిందన్నారు. అనాలోచిత నిర్ణయాలు, విచ్చలవిడి అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని, మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసి నవ్యాంధ్రకు ఆశాకిరణమైన అమరావతిని నిర్వీర్యం చేశారని అన్నారు. రోడ్లను కనీసం మరమ్మతులు చేయకుండా రవాణా రంగాన్ని దెబ్బతీశారని, పారిశ్రామికవేత్తలను బెదిరింపులతో పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని పేర్కొన్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల భూములకు అభద్రత సృష్టించారని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు అచ్చెన్నాయుడు.. రూ.1,600 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించకుండా అన్నదాతలను మోసం చేశారని అన్నారు. బటన్ నొక్కుతున్నామని ప్రచారం చేసుకుంటూ సంక్షేమ పథకాలపై అనేక ఆంక్షలు విధించి లక్షలాది మందిని లబ్ధికి దూరం చేశారని మండిపడ్డారు. తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై రూ.1.29 లక్షల కోట్ల భారం మోపారని ఆరోపించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి, మాఫియాలకు కేంద్రంగా మార్చి యువత భవిష్యత్తును నాశనం చేశారని, శాంతిభద్రతలను పూర్తిగా దెబ్బతీశారని అన్నారు.






