అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన పోలీసులు
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. ఆయన వల్ల బీజేపీకి ఒరిగింది ఏమీ లేదని పేర్కొంటూ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై పలువురు ఎంపీ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేసిన మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఈటలను విమర్శిస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న కొంపల్లి, సుచిత్ర, కేపీహెచ్బీ కాలనీ ప్రాంతాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విదితమే.
దీనిపై బీజేపీ నాయకులు సైబరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా నలుగురిని అరెస్ట్ చేయడం కలకలం రేపింది బీజేపీలో. తదుపరి విచారణ నిమిత్తం వారిని కే పీ హెచ్ బీ పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకొన్న కూకట్ పల్లి బీజేపీ నాయకులు స్టేషన్ కు చేసుకున్నారు. ఏ ఉద్దేశంతో వాటిని ఏర్పాటు చేశారు? దీని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ బయట ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.





