వరి సేకరణ లక్ష్యాన్ని కేంద్రం పెంచాలి
కోరిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్
హైదరాబాద్ : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వరి సేకరణ లక్ష్యంలో భారీ సవరణ కోరారు. రబీ 2025-26 సీజన్కు సంబంధించి వరి సేకరణ లక్ష్యాన్ని ప్రస్తుతమున్న 35 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 54.50 ఎల్ఎంటీకి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ 54.50 ఎల్ఎంటీ బియ్యం పరిమాణం, రాష్ట్రం ఇప్పటికే సేకరించిన 80.09 LMT ధాన్యానికి సమానం. రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తిని సాధించిన నేపథ్యంలో, ప్రస్తుత కేటాయింపులు రాష్ట్ర వాస్తవ ధాన్యపు ఉత్పత్తిని , సేకరణను ప్రతిబింబించడం లేదని, దీనివల్ల రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్రం వేల కోట్ల రూపాయల అదనపు వ్యయాన్ని భరించాల్సి వస్తోందని ప్రభుత్వం వాదిస్తోంది.
ఢిల్లీకి వెళ్లిన ఉన్నత స్థాయి బృందానికి నాయకత్వం వహించిన మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం , ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. సేకరణ, కస్టమ్ మిల్డ్ రైస్ (CMR) సరఫరాకు సంబంధించిన పలు కీలక డిమాండ్లకు తక్షణ ఆమోదం తెలపాలని వారు కోరారు. రాష్ట్రంలో పండించిన రబీ ధాన్యం ప్రధానంగా ‘పారాబాయిల్డ్ రైస్’ (ఉడికించిన బియ్యం) తయారీకి అనుకూలంగా ఉంటుందని పేర్కొంటూ, సేకరించిన మొత్తం ధాన్యాన్ని అదే రూపంలో సరఫరా చేయడానికి అనుమతి ఇవ్వాలని కూడా తెలంగాణ కోరింది.