newsseals.com

బాధిత కుటుంబాల‌కు సీఎం విజ‌య్ భ‌రోసా

July 11, 2026 · VijayaBhaskar

చెన్నై : క‌రూర్ ఘ‌ట‌న త‌న‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింద‌న్నారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇదిలా ఉండ‌గా సెప్టెంబర్ 27, 2025న విజయ్ ప్రసంగించిన టీవీకే (TVK) ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరణించిన ఈరోడ్‌కు చెందిన కందసామి కుమారుడి తల్లి కె. శాంతికి రూ. 10 లక్షల పరిహారాన్ని కూడా ఆయన అందించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కరూర్‌కు తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ కరూర్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కరూర్‌లో జరిగిన ఆ తొక్కిసలాటలో ప్రభావితమైన 31 కుటుంబాల సభ్యులకు ఆయన కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.

పాఠశాల విద్యాశాఖ, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పోలీస్, రిజిస్ట్రేషన్, పట్టణ పంచాయతీల శాఖలు, కరూర్ కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, నైట్ వాచ్‌మన్ వంటి ఉద్యోగాలు లబ్ధిదారులకు కల్పించారు. అంతకు ముందు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్, 41 మంది బాధితుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిస్తూనే, ఆ నియామకాలు తాత్కాలిక ప్రాతిపదికన ఉండాలని తీర్పునిచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రజా పనులు ,క్రీడా అభివృద్ధి శాఖ మంత్రి ఆధవ్ అర్జున, రెవెన్యూ , విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కె.ఎ. సెంగోట్టయన్, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి సి. విజయలక్ష్మి, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి, ప్రధాన కార్యదర్శి ఎం. సాయికుమార్, కరూర్ జిల్లా కలెక్టర్ సి. ముత్తుకుమారన్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related News