అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే వ్యసనంగా మారితే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలోనే యువత ఎక్కువగా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ రోజు రోజుకు మారుతోందన్నారు. దీనిని గుర్తించి సద్వినియోగం చేసుకోగలిగితే దేశం, రాష్ట్రం అన్ని రంగాలలో మరింత అభివృద్దిని సాధిస్తుందని పేర్కొన్నారు. ఏపీ సర్కార్ టెక్నాలజీని భారీ స్తాయిలో వాడుకుంటోందని చెప్పారు సీఎం.
అభివృద్ధి ప్రాజెక్టులు కూడా సమతూకంలో జరగాలనే అన్ని ప్రాంతాలకూ పరిశ్రమలు, ప్రాజెక్టులు చేపడుతున్నాం అన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఆర్ధిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. జనాభా సంరక్షణ అనేదే ఈ సమయంలో కీలకం అన్నారు. జనాభా పెంచాలని మాట్లాడితే విమర్శలు వచ్చాయని చెప్పారు. పిల్లలను పెంచటం అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు అది ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. పురుషులు కూడా సమానంగానే పిల్లలను పెంచే బాధ్యతల్ని తీసుకోవాలని నేను సూచిస్తున్నాని పేర్కొన్నారు.
కాన్పుల్లో సిజేరియన్లు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణాలో జరిగిన ఘటన అత్యంత బాధాకరం అన్నారు . పోక్సో కేసు ఉన్న నిందితుడు కేసు పెట్టిన వారి కుటుంబంలో వారిన హత్య చేశాడు. అత్యంత దారుణమైన ఘటన ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. సామాజిక మాధ్యమాలు బాధ్యతారహితంగా వినియోగించటం, అసభ్యకరమైన, హింసాత్మక దృశ్యాలను నియంత్రించాలని అన్నారు. టెక్నాలజీ- స్పిరుచ్వాలిటీ ద్వారా యువతకు ప్రపంచాన్ని జయించే శక్తి సొంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.





