ప్రజల ఆస్తులు ప్రవేట్ పరం చేస్తే ఎలా..?
తాడేపల్లి గూడెం : ఏపీ కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్నారని ఆవేదన చెందారు. సోషల్ మీడియా పేరిట చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎవరి మీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారంటూ భగ్గుమన్నారు. టెట్ రూపంలో టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని జగన్ రెడ్డి ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. టెట్ రాకముందు నుంచి టీచర్లుగా పని చేస్తున్న వారికి ఇప్పుడు టెట్ తప్పనిసరి చేయడం సరికాదన్నారు. పైగా వాళ్లంతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అయిన వారే. వీళ్లు ఉద్యోగాలు పొందనప్పుడు వీళ్లకు టెట్ అనే పరీక్ష లేదన్నారు. కానీ, ఇప్పుడు వీరిని టెట్ రాయమనడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు .
సుదీర్ఘ కాలంగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్న వారిని, ఇప్పుడు అన్ని సబ్జెక్టులున్న టెట్ పరీక్ష రాయమనడం, దాన్ని తప్పనిసరి చేయడం ఏ మాత్రం సరికాదన్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని కలిసి వారికి సమస్యను నివేదించాలని సూచించారు.ప్రైవేటు పేరుతో ప్రభుత్వ ఆస్తులను ఎక్కడిక్కడ దోచి పెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు జగన్ రెడ్డి. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం అన్నారు. నిజానికి ఆయా ప్రాజెక్టుల పనులన్నీ మొదలై కొలిక్కి వస్తున్నాయన్నారు. అలాంటి వాటిని, ఇంకా దాదాపు పూరై్తన వాటిని కూడా ఇప్పుడు ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయం అని పేర్కొన్నారు. దారుణమైన స్కాం ఇది. దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం అతి దారుణం అన్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏంటి? రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1500 కోట్లుకు ఇవ్వడం స్కాం కాదా? అని ప్రశ్నించారు.