భవిష్యత్ తరాల కోసమే క్రీడా సంస్థ ఏర్పాటు
విశాఖపట్నం జిల్లా : భవిష్యత్ తరాల కోసమే విశాఖపట్నంలో పీవీ సింధు పేరుతో అకాడమీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం భూమిపూజ చేశారు. పీవీ సింధు, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అకాడమీ భవన నమూనాతో పాటు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక సౌకర్యాలు, వసతుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. అకాడమీపై రూపొందించిన ఏవీని వీక్షించారు. అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, శాప్ ఎండీ ఎస్.భరణి, గ్రీన్ కో ఎనర్జీ ఎఫీషియన్సీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ చలమలశెట్టి స్వాతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పీవీ సింధు ప్రసంగించారు. భారత క్రీడలకు నేను చేస్తున్న అత్యంత అర్థవంతమైన సేవ ఈ కేంద్రమే. భవిష్యత్ తరాలకు అవకాశాలు కల్పించే ఒక సంస్థను నిర్మించడానికి నా కెరీర్ మొత్తంలో నేను సంపాదించిన దానిలో ఎక్కువ భాగాన్ని కేటాయిస్తున్నాను అని అన్నారు. యువ క్రీడాకారులు తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి అవసరమైన ప్రపంచ స్థాయి కోచింగ్, క్రీడా విజ్ఞానం, విద్య , మద్దతును పొందేలా ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించాలన్నది నా కల. కార్పొరేట్లు , దాతలు కూడా సీఎస్ఆర్ , దీర్ఘకాలిక సహకారం ద్వారా ఈ ప్రయాణంలో మాతో చేరాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తద్వారా రాబోయే తరాలకు సేవ చేసే ఒక సంస్థను మనం కలిసి నిర్మించగలం అని సింధు అన్నారు.