newsseals.com

భూములు కోల్పోయిన రైతుల‌కు ఎంపీ భ‌రోసా

August 10, 2026 · VijayaBhaskar

వ‌న‌ప‌ర్తి జిల్లా : భూములు కోల్పోయిన రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు బీజేపీ ఎంపీ డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి. మహబూబ్‌నగర్ – డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతు సోదరులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి పనుల కోసం భూములు కోల్పోతున్న 128 మంది రైతులకు (27.4 ఎకరాలు) ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. మార్కెట్ విలువ ప్రకారం ప్రతి ఒక్కరికీ మెరుగైన నష్టపరిహారం అందేలా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నానని ప్ర‌క‌టించారు డీకే అరుణ‌. వనపర్తి జిల్లా మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో జరిగిన రైల్వే డబ్లింగ్ లైన్ భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతుల విజ్ఞప్తులు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

సామాన్యుడికి అత్యంత చౌకైన, వేగవంతమైన ప్రయాణ సదుపాయం అయిన రైల్వే రంగాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అత్యాధునికంగా అభివృద్ధి చేస్తోందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో రైల్వే గేట్ల వల్ల ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు ప్రతీ చోటా రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామ‌ని చెప్పారు డీకే అరుణ‌. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులతో ఈ ROBల నిర్మాణాలను మంజూరు చేస్తోందన్నారు. భూ నిర్వాసితులైన రైతు సోదరులెవ్వరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి , ఆర్డీవో సుబ్రమణ్యం , బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Related News