అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు (SIPB) సమావేశం జరిగింది. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల లోని 37 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనల పై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ , పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , ఆర్తిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పాల్గొన్నారు.
వీరితో పాటు ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ భద్రంగా ఉండడం కారణంగానే భారీ ఎత్తున పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతి రాజధాని నిర్మాణం రూపు దిద్దుకుంటోందన్నారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు. పనులు డిసెంబర్ లోగా పూర్తి కావాలని ఆదేశించారు.





