హైదరాబాద్ : ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామాలను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఉండాలని, జీపీఎస్ఏపీ కేవలం ఒక డాక్యుమెంట్ కాదని, అది గ్రామ భవిష్యత్తు అభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలు గ్రామసభల నుంచే రావాలని, ఐదు, పది సంవత్సరాల దృష్టితో గ్రామాల భవిష్యత్తును ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని వనరులు, అవసరాలు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.
ఎల్నినోను ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, శాఖల మధ్య సమన్వయంతో ఒకే పనికి అనేక ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని సీతక్క అన్నారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న క్షేత్రస్థాయి అధికారులు రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే గ్రామాల్లో వేల సంఖ్యలో మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపనలు చేశారని, వాటి నిర్మాణాలను వేగవంతం చేసి త్వరలో ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి గ్రామ పంచాయతీకి వెబ్సైట్ను మంత్రులు, సీఎస్ ప్రారంభించారు. గ్రామంలోని వనరులు, అవసరాలు, చేపట్టాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు ఇందులో ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి.






