అమరావతి : తనపై నమ్మకం ఉంచి భారతీయ జనతా పార్టీలో అత్యున్నతమైన పదవిని కట్టబెట్టినందుకు సర్వదా కృతజ్ఞుడై ఉంటానని స్పష్టం చేశారు ఏపీకి చెందిన సీనియర్ నాయకుడు విష్ణు వర్దన్ రెడ్డి. తన రాజకీయ జీవితంలో ఇది ఒక అరుదైన, మరపురాని ఘట్టం అని పేర్కొన్నారు. ప్రధాని నూతనంగా నియామకం పొందిన బీజేపీ జాతీయ పదాధికారులతో దాదాపు 4 గంటల పాటు సమయం గడిపారని, మా అందరి వ్యక్తిగత, కుటుంబ విషయాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకుని, సమాజానికి అంకితభావంతో సేవ చేయాలని మార్గనిర్దేశం చేశారని తెలిపారు.
ప్రతి ఒక్కరిలో సేవాభావాన్ని, బాధ్యతను పెంపొందించేలా ప్రధాని నరేంద్ర మోదీ అందించిన విలువైన సూచనలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని స్పష్టం చేశారు విష్ణువర్దన్ రెడ్డి. ఈ అపూర్వమైన బాధ్యతను, అవకాశాన్ని కల్పించిన పీఎంకు రుణపడి ఉంటానని వెల్లడించారు. ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో సహకరించిన పెద్దలకు పార్టీ, రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు . ఈ సందర్బంగా తనకు అప్పగించిన కీలకమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు బీజేపీ సీనియర్ నాయకుడు.





