హైదరాబాద్ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు వన్ వార్డ్ ఎవ్రీ డే పేరుతో స్థానికులతో సమావేశం కావడం దీని ఉద్దేశం. ‘వన్ వార్డ్ ఎవ్రీ డే’ కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో పాటు ఎమ్మెల్యే; సెరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్, మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ , సంబంధిత శాఖల అధికారులతో కలిసి శేరి లింగంపల్లి జోన్ లోని మియాపూర్ సర్కిల్, మదీనగూడ , హఫీజ్ పేట వార్డులను సందర్శించారు.
కమిషనర్ జి. సృజన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWA) ప్రతినిధులు , స్థానిక నివాసితులతో మాట్లాడారు, అలాగే వార్డు పర్యటనలో లేవనెత్తిన పౌర సమస్యలను సమీక్షించారు. ఇందులో ప్రధానంగా సీసీ కెమెరాల ఏర్పాటు, బీటీ రోడ్ల అవసరాలు, మరమ్మతులు, డ్రైనేజీ, భూగర్భ డ్రైనేజీ (UGD) , వర్షపు నీటి పారుదల , నీరు నిలిచి పోవడానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. వీటితో పాటు వీధి దీపాలు , విద్యుత్ సంబంధిత పనులు, పార్కుల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, ట్రాఫిక్ , పాదచారుల రాకపోకలు, ఆక్రమణలు , చెత్తను అక్రమంగా పారవేయడం,
కమ్యూనిటీ హాల్ , శ్మశానవాటికకు సంబంధించిన పనులు చేపట్టాలని స్థానికులు కోరారు.
నివాసితులు లేవనెత్తిన సమస్యలపై సకాలంలో చర్యలు తీసుకోవాలని, అలాగే గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు సమన్వయంతో పని చేయాలని కమిషనర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.





