హైదరాబాద్ : ఎలినినో ఎఫెక్టు కారణంగా సాగు, తాగు నీటికి ఇబ్బంది ఏర్పడుతోంది. దీంతో తెలంగాణ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ మేరకు రైతులు జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు నేస్తం ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పిస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఎరువుల సమతుల్య వినియోగం, యూరియా అధిక వినియోగం వల్ల కలిగే అనర్థాలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతోంది. రైతునేస్తం 104వ భాగంలో ఎరువుల వినియోగం, నానో యూరియా వినియోగం తదితర అంశాలపై శాస్త్రవేత్తలు సూచనలు అందించారు.
అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన Fertilizer Sale App (FFS App) ద్వారా ఎరువుల విక్రయాలను రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో, ఈ యాప్ విధానంపై రైతులకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో ఈ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతుండగా, మిగిలిన జిల్లాల్లోనూ ఈ నెల 27 నుంచి సేవలు అందుబాటులోకి తీసుకు రావడానికి చర్యలు చేపడుతున్నారు. FFS యాప్లో రైతులు ఎదుర్కొనే సమస్యలను కేంద్ర ప్రభుత్వం నియమించిన నోడల్ అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎరువుల లభ్యత, వినియోగ విధానం, సమతుల్య ఎరువుల వినియోగంపై నిరంతరం అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు.





