కోల్ కతా : శ్రీలేఖ మిత్ర ప్రదర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్ పట్ల కలకత్తా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కార్టూన్ ‘అసభ్యకరమైనది’ అని వ్యాఖ్యానించినప్పటికీ అరెస్టు నుండి రక్షణ కల్పించింది. బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ప్రధాని నరేంద్ర మోదీని చిత్రీకరిస్తూ ప్రదర్శించిన పోస్టర్ కలకలం రేపింది. అయితే ఆమె విచారణకు సహకరించే షరతుపై నమోదైన 16 ఎఫ్ఐఆర్ల (FIRs) విషయంలో డిసెంబర్ 24 వరకు బలవంతపు చర్యలు తీసుకోకుండా కోర్టు నిషేధం విధించింది. జూలైలో ఇక్కడ జరిగిన విద్యార్థుల నిరసన ర్యాలీలో శ్రీలేఖ మిత్ర ప్రదర్శించిన పోస్టర్లో ప్రధాని మోదీని “అసభ్యకరంగా” చిత్రీకరించడంపై కోర్టు ఈ స్పందన తెలిపింది. నీట్ పరీక్షా పత్రం లీక్ ఆరోపణలపై జూలై 24న కోల్కతా వీధుల్లో పలువురు నిరసన తెలిపారు.
ఢిల్లీ , దేశంలోని ఇతర ప్రాంతాల్లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి ఒక రోజు ముందు ఈ నిరసన జరిగింది. మధ్య కోల్కతాలోని ఎస్ప్లానేడ్ ప్రాంతంలో జరిగిన నిరసనలో మిత్ర పాల్గొన్నారు . పోస్టర్ పట్టుకుని ఫోటోకు పోజులిచ్చారు. ఆ పోస్టర్లో ప్రధానిని అవమానకరమైన రీతిలో చిత్రీకరించారని బీజేపీ ఫిర్యాదు చేసింది. వివిధ జిల్లాల్లో ఆమెపై మరికొన్ని ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరుతూ మిత్ర దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సౌగత భట్టాచార్య మాట్లాడారు. ఆ కార్టూన్ స్వభావాన్ని చూస్తే కోర్టు మనస్సాక్షి దిగ్భ్రాంతికి గురవుతుంది అని అన్నారు. ఆ పోస్టర్ను అసభ్యకరమైన ప్రదర్శనగా అభివర్ణిస్తూ దేశంలోని ఏ వివేకవంతుడైన పౌరుడూ ఇలాంటిది ప్రదర్శించి ఉండకూడదు అని ఆయన వ్యాఖ్యానించారు.






