newsseals.com

క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ అవినీతిపై విచార‌ణ జ‌రిపిస్తాం

September 4, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌ల్వ‌కుంట్ల కుటుంబంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వారి ఫ్యామిలీని ఆయ‌న కల్వ‌కుంట్ల అవినీతి అకాడ‌మీ అంటూ ఎద్దేవా చేశారు. అక్క‌డ‌ అన్ని అక్రమ కార్యకలాపాలకు బోధన జరుగుతుందన్నారు. ఇక కేటీఆర్ ను ప్రొఫెస‌ర్ అంటూ పేర్కొన్నారు. ఆయ‌న దోపిడీ ఎలా చేయాల‌నే దానిపై బోధిస్తార‌ని ఎద్దేవా చేశారు. ఇక కేసీఆర్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అవినీతి కాలేజీ ప్లేస్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అంటూ మండిప‌డ్డారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీసిన గ్లోబరీనా పేపర్ లీక్‌లు, ఆ తర్వాత దేశ వ్యాప్తంగా జరిగిన నీట్ పేపర్ లీక్‌లు, ఆత్మహత్యల విషయంలో మీరు ఇప్పటికే దేశానికి ఒక గుణపాఠం నేర్పారని అయినా కేసీఆర్ ఫ్యామిలీకి బుద్ది రావ‌డం లేద‌న్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి.

మీ సొంత అక్క, బావ ఫోన్లను ఎలా ట్యాప్ చేయాలో మిమ్మ‌ల్ని చూసి నేర్చుకోవాల‌ని అన్నారు. ధరణి ద్వారా భూములను ఎలా ఆక్రమించాలో అంద‌రికీ తెలిసిన విష‌య‌మేన‌ని పేర్కొన్నారు. ఇక ఆరోగ్య మంత్రిగా పనిచేస్తూ ఆసుపత్రులతో వ్యాపారం ఎలా చేయాలనేది హ‌రీష్ రావును చూస్తే తెలుస్తుంద‌న్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. పార్టీకి చెందిన ₹20 కోట్ల సంపదను ₹1,600 కోట్లుగా ఎలా మార్చాలో చూశామ‌న్నారు. ప్రజాధనాన్ని దోచుకుని, రబ్బరు చెప్పుల వ్యాపారం నుండి ఫామ్‌హౌస్ సామ్రాజ్యం వరకు ఎలా ఎదిగారో ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిన విష‌య‌మేన‌ని పేర్కొన్నారు. ప్రొఫెసర్ డ్రామా రావు దేశం తదుపరి పాఠానికి సిద్ధంగా ఉంద‌న్నారు.

Related News