ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ( టీటీడీ) ఆధ్వర్యంలో పలు సంస్థలు ఇతోధికంగా సేవలు అందిస్తున్నాయి. విద్య, వైద్యం, సేవ, ధార్మిక ప్రచారం ఇలా ప్రతి ఒక్క సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తమకు తోచిన రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రతి రోజూ తిరుమలలో కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు భక్తులు. తమ కోరికలు తీరడంతో భారీ ఎత్తున కానుకలు సమర్పించుకుంటున్నారు. దీంతో ప్రతీ రోజూ స్వామి వారికి కానుకలు, ఆభరణాలు, నగదు రూపేణా దాదాపు రూ. 5 కోట్లకు పైగా హుండీ ఆదాయం సమకూరుతోంది. మరో వైపు దాతలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
ఇందులో భాగంగా టిటిడి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్కు హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన ప్రముఖ దాత కుంచాల మధురాం రెడ్డి రూ.1.11 కోట్ల భారీ విరాళాన్ని అందించారు. హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును కలిసి దాత ఈ విరాళాన్ని అందజేశారు. గోసంరక్షణ, గోసేవకు పెద్దపీట వేస్తున్న టీటీడీకి అండగా నిలిచి, భారీ విరాళం అందించిన దాత కుంచాల మధురాం రెడ్డిని చైర్మన్ బి.ఆర్. నాయుడు అభినందించారు. గోవుల సంరక్షణకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని, భక్తులు, దాతల సహకారంతో టీటీడీ గోసంరక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.