పని చేయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చావాలి
నాగర్ కర్నూల్ జిల్లా : భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ పాలనా పరంగా ఫెయిల్ అయ్యిందన్నారు. రైతులకు ఎరువులు, విద్యార్థులకు రూ. 12,000 ఫీజు రీయింబర్స్మెంట్ , బాలికలకు స్కూటీలు అందించడంలో విఫలమైన మంత్రులు, ఎమ్మెల్యేలు చచ్చి పోవాలని ఆయన తీవ్రంగా విమర్శించారు. జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. తులం బంగారం, రైతు బీమా, రైతు బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన పేరుతో జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు మర్రి జనార్దన్ రెడ్డి. ఇచ్చిన హామీలలో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తారని జోష్యం చెప్పారు .