తిరుమలలో దుకాణాలకు ‘జియో ఫెన్సింగ్’ : టీటీడీ
తిరుమల : తిరుమలలోని దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థల వివరాలను డిజిటల్ విధానంలో సమగ్రంగా అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు, లైసెన్సుల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో యాప్ ను రూపొందిస్తున్న అమరావతి సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
దీనిపై ఆ సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా యాప్ గురించి అదనపు ఈవోకు వివరించారు. తిరుమలలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం, లైసెన్సు వివరాలు, గడువు తేదీలు తదితర అంశాలు ఒకే వేదికపై అందుబాటులో ఉండేలా యాప్ ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. జియో ఫెన్సింగ్ సాంకేతికత ఆధారంగా దుకాణాల ఖచ్చితమైన స్థానాలను గుర్తించి, వాటి నిర్వహణ, పర్యవేక్షణను సులభతరం చేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.
అనంతరం యాప్ రూపకల్పన పురోగతి, అందులో పొందుపరుస్తున్న సదుపాయాలు, జియో ఫెన్సింగ్ వ్యవస్థ అమలు, లైసెన్సింగ్ నిర్వహణ తదితర అంశాలపై అదనపు ఈవో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకత , సమర్థతకు ప్రాధాన్యతనిస్తూ యాప్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. తిరుమలలోని అన్ని వ్యాపార సంస్థల వివరాలను సమగ్రంగా నమోదు చేసి, సేవల నిర్వహణను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.