హైదరాబాద్ లో గిగ్ కార్మికులకు ప్రగతి కేంద్రాలు
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పని చేస్తున్న వేలాది మంది గిగ్ , ప్లాట్ ఫారమ్ కార్మికులకు తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. గిగ్ కార్మికులకు ‘ప్రగతి కేంద్రాలు అండగా ఉండనున్నాయి. రోజంతా బయట తిరుగుతూ పని చేసే గిగ్ , ప్లాట్ఫారమ్ కార్మికుల కోసం ప్రాథమిక పట్టణ మౌలిక సదుపాయాల లోపాలను సరిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్, దుస్తుల విక్రయాలు , ఇతర ‘లాస్ట్-మైల్’ డెలివరీ నెట్వర్క్లతో సహా వివిధ ప్లాట్ఫారమ్లలో పనిచేసే గిగ్ కార్మికులందరికీ ఈ ప్రగతి కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లో ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం , ఒక ఆన్లైన్ కిరాణా డెలివరీ యాప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ద్వారా, పని వేళల్లో గిగ్ కార్మికులు విశ్రాంతి తీసుకోవడానికి , అవసరమైన సదుపాయాలను పొందడానికి ప్రత్యేక స్థలాలు అందుబాటులోకి వస్తాయి.
హైదరాబాద్లోని 166 మంది గిగ్ , ప్లాట్ఫారమ్ కార్మికులపై 2024లో నిర్వహించిన ‘హీట్వాచ్’ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 69 శాతం మందికి పరిశుభ్రమైన మరుగుదొడ్ల సదుపాయం లేదని, 80 శాతం మందికి పైగా పని సమయంలో నీడ పట్టున విశ్రాంతి తీసుకునే స్థలాలు లేదా చల్లదనాన్నిచ్చే సదుపాయాలు లేవని ఈ సర్వేలో తేలింది. మెట్రోపాలిటన్ ప్రాంతం , పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ దీనిపై స్పందించారు. హైదరాబాద్ పట్టణ ఆర్థిక వ్యవస్థలో గిగ్ , ప్లాట్ఫారమ్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రాజెక్ట్ ప్రగతి ద్వారా కార్మికుల ఆచరణాత్మక అవసరాలను తీర్చేలా సులభంగా అందుబాటులో ఉండే కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు. ఏ ప్లాట్ఫారమ్తో సంబంధం ఉన్నప్పటికీ కార్మికులందరూ వీటిని వినియోగించు కోవచ్చు అని ఆయన పేర్కొన్నారు.