ఈగోలు పక్కన పెట్టండి ప్రజలకు సేవలందించండి
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయా జిల్లాల నుంచి వచ్చిన కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈగోలు లేకుండా ప్రజల కోసం పని చేద్దామని, ప్రజా సేవకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. సాధించింది చెప్పాలని, సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుదాం అన్నారు. 7వ కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను కూడా చర్చించుకుని లక్ష్యానికి చేరువ అయ్యేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈసారి లీడర్షిప్ అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా చర్చించాలని నిర్ణయించాం అన్నారు. రాష్ట్ర పునర్ నిర్మాణంలో 27 నెలల్లో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టామని పేర్కొన్నారు. రూ. 1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ. 1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశామని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు.
రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరిట ప్రగతి కార్యక్రమాలు చేపట్టాం అని తెలిపారు. హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్ -1 , పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తి చేశాం అన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి గుంటూరు, విజయవాడకు రాజధానిని కనెక్టు చేశాం అన్నారు. ఎకనామిక్ టైమ్స్ పత్రిక సీఈఓ టూ వాటర్ మాన్ అంటూ కథనం రాసిందని, చాలా సంతోషం కలిగిందని చెప్పారు. తాను చేసిన కృషికి దక్కిన గౌరవం అన్నారు. గ్లోబల్ డ్రీమ్ కేబినెట్లో నా పేరు వచ్చినప్పుడు, సీఈఓ సీఎం అన్నప్పుడు నేను ఇంత ఆనందించ లేదన్నారు. .