విరాట్ విశ్వకర్మ భగవాన్ కు జగన్ నివాళి
తాడేపల్లి గూడెం : విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఇవాళ. ఈ సందర్భంగా గురువారం తాడేపల్లి గూడెంలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ, గాయత్రీ దేవి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని, దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వ కర్మలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో విశ్వ కర్మలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. కానీ ఇవాళ ఏపీ కూటమి సర్కార్ హయాంలో వారిని పట్టించు కోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రాచరిక, కుటుంబ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ పక్కదారి పట్టిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో ఏపీ కూటమి నాయకులకు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఇదే క్రమంలో విశ్వ కర్మలు తమకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు ఎస్.ఎం. పవిత్ర, తోలేటి శ్రీకాంత్, విశ్వబ్రాహ్మణ నాయకులు ఎస్.డి. మురళీకృష్ణ, కె. గురవాచారి, ఉదయ్కుమార్, శేఖర్తో పాటు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.