పారదర్శకంగా రాష్ట్రంలో ప్రజా పాలన : భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రజలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం , అభివృద్ధిని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. గత 1,000 రోజుల పాలనలో ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించడం , ‘గృహ జ్యోతి’ ద్వారా పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కల్పించడం వంటి చర్యలతో ప్రతి ఇంటిలోనూ వెలుగులు నింపామన్నారు.
రైతులకు అండగా నిలుస్తూ చారిత్రాత్మక రుణమాఫీ, ‘రైతు భరోసాస , సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం జరిగిందని చెప్పారు మల్లు భట్టి విక్రమార్క. ఇందిరమ్మ ఇళ్లు, ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’, అత్యాధునిక ఆసుపత్రుల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాలు , పారదర్శకమైన భూముల రీ-సర్వే వంటి కార్యక్రమాలతో నవ తెలంగాణ నిర్మాణానికి పునాది వేశామని చెప్పారు డిప్యూటీ సీఎం. బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజా పాలన నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.