newsseals.com

2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

September 18, 2026 · VijayaBhaskar

శ్రీ సత్యసాయి జిల్లా : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను జగన్ మోసగిస్తే, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ రాష్ట్ర యువతకు బంగారు పునాదులు వేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌స్టం చేశారు. తమది జెన్ జీ ప్రభుత్వమని, చదువుకున్న యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. నైపుణ్యం పోర్టల్ ను ఏర్పాటు చేసి, అందులో నిరుద్యోగ యువతకు అవసరమయ్యే ఉద్యోగావకాశాలు, స్కిల్ పెంచుకునే వివరాలు పొందుపర్చామన్నారు. యువశక్తితో 2047 నాటికి ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని ధీమా వ్యక్తంచేశారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు.

అనంతరం స‌విత మీడియాతో మాట్లాడారు. చదువులు పూర్తి కాగానే యువతకు ఉద్యోగాలు లభించేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. కేవలం రెండేళ్ల కాలంలో ఏపీకి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానికంగానే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకొంటున్నారని మంత్రి సవిత తెలిపారు. యువతకు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని తెలిపారు. ఈ ఏడాది 10,060 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ ను మంత్రి లోకేశ్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిలో భాగంగా ఇటీవల ఏపీపీఎస్సీ ద్వారా 892 ఉద్యోగాలు, పోలీస్ డిపార్ట్ మెంట్ లో 2,050 పోస్టులు, అగ్నిమాక డిపార్ట్ మెంట్ లో 147 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. మూడు వేల టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారన్నారు. రాబోయే మూడేళ్లలో మూడు డీఎస్సీలు నిర్వహించనున్నామని తెలిపారు. ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, యువత బంగారు పునాదులు వేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.

Related News