తిరుమల : తిరుమలలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీవారి గరుడ వాహన సేవలో పలు విశేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గరుడ వాహన సేవ సందర్భంగా తొలిసారిగా సింగపూర్ నుంచి వచ్చిన కళాకారులు శ్రీ సీతారామ కళ్యాణంలోని పౌరాణిక పాత్రలను ప్రదర్శించి భక్తులను అలరించారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సామాన్య భక్తులు గరుడ వాహన సేవను సులభంగా దర్శించు కునేందుకు తిరుమలనంబి నుంచి ప్రత్యేక క్యూలైన్ ద్వారా వాహన దర్శనానికి అనుమతించారు. ఉత్సవాలను పురస్కరించుకుని భారీ ఎత్తున తరలి వచ్చారు భక్తులు. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు అనంతపూర్ రేంజ్ సీపీ ఆధ్వర్యంలో.
గరుడసేవ సందర్భంగా భక్తులకు మొత్తం 15 రకాల మెనూ అందించారు. ఇందులో 8 రకాల ఆహార పదార్థాలు, 7 రకాల పానీయాలు ఉన్నాయి. 24 లక్షల సర్వింగ్స్కు అన్నప్రసాదం ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (టీటీడీ). భక్తుల భారీ రాకను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్నప్రసాదం విభాగం ముందస్తు ప్రణాళికతో అన్నప్రసాదం, పానీయాలు, అల్పాహారం కలిపి సుమారు 24 లక్షల సర్వింగ్స్ అందించేలా ఏర్పాట్లు చేసింది. భక్తులకు అందుతున్న వసతి సౌకర్యాలపై ఆరా తీశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర, ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవో శరత్ .





