అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడుకు డీఎస్సీలు నిర్వహిచడం కొత్త కాదని మంత్రి సవిత అన్నారు. లక్షలాది టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత ఆయన సొంతమన్నారు. అయిదేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను, వారి తల్లిదండ్రులను ఊసూరు మనిపించారని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారన్నారు. 2025 మెగా డీఎస్సీని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దిగ్విజయంగా నిర్వహించారన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారన్నారు. ఏడాది కిందట జరిగిన మెగా డీఎస్సీలో ఇప్పుడు అక్రమాలు జరిగాయంటూ జగన్, గొడ్డలి పార్టీ డ్రామాలు ఆడుతోందన్నారు.
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అంటే జగన్ కు భయమని, అందుకే ఆయన రాజీనామా చేయాలంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారా లోకేశ్ దేనికి రాజీనామా చేయాలి, తల్లికివందనం నిధులు అందజేసినందుకా, సంస్కరణలు తీసుకొచ్చి విద్యా శాఖను గాడిలో పెట్టినందుకా.. సన్నబియ్యంతో విద్యార్థుల కడపునింపుతున్నందుకా…16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినందుకా..? అని నిలదీశారు. ఆధారాలు ఉంటే చర్చకు రావాలని మంత్రి లోకేశ్ సవాల్ చేసినా జగన్ భయపడి రావడం లేదన్నారు. మరోసారి సవాల్ చేస్తున్నామని, మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని రుజువులు ఉంటే… అసెంబ్లీలో చర్చకు రావాలని అన్నారు. మంత్రి నారా లోకేశ్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్ కు, వైసీపీ నేతలకు లేదని మంత్రి సవిత అన్నారు.






