హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై ఆర్ అండ్ బి అధికారులు, వర్క్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో నిర్లక్ష్యాన్ని, జాప్యాన్ని అస్సలు సహించేది లేదని హెచ్చరించారు ఈ సందర్బంగా. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఉప్పల్ రూట్ లో ట్రాఫిక్ తో అవస్థ పడుతున్న ప్రజల కష్టాలు తీర్చడమే మా లక్ష్యం అన్నారు.
పనుల వేగం పెంచేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్ పవర్ పెంచి 3 షిఫ్టుల్లో పనులు జరగాలన్నారు. (రాత్రి 11 నుండి ఉదయం 6 వరకు). కారిడార్ కింద ఉన్న 6.25 కి.మీ బీటీ రోడ్డు పనులు ఈ నెలాఖరు కల్లా పూర్తి కావాలని ఆదేశించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అటు నారపల్లి, ఇటు ఉప్పల్.. ఇరువైపుల లాంచింగ్ గడ్డర్లతో పనుల్లో వేగం పెంచాలన్నారు. అక్టోబర్ (దసరా) నాటికి ఎలివేటెడ్ కారిడార్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు .ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి తీరుతాం అని ప్రకటించారు.






