హైదరాబాద్ : తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏఐసీసీ మాజీ చీఫ్, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీని ఏకి పారేశారు. ఇవాళ బీజేపీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. జార్ఖండ్లో కాంగ్రెస్-జేఎంఎం (JMM) కూటమి ప్రభుత్వం అర్ధరాత్రి వేళ విద్యార్థులపై జరిపిన అమానుషమైన లాఠీచార్జ్ , పోలీసుల దాష్టీకం అత్యంత విషాదకరం అన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ పార్లమెంటులో చర్చలకు దూరంగా ఉంటుండగా మరోవైపు జార్ఖండ్ విద్యార్థులపై జరిగిన ఈ దారుణమైన ఘటనపై పూర్తిగా మౌనం వహిస్తున్నారని ఆరోపించారు.
.ఇది ఆయన ద్వంద్వ వైఖరిని స్పష్టంగా బయట పెడుతోందన్నారు ఎన్ .రామచందర్ రావు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి ప్రయత్నించిన రాహుల్ గాంధీకి, ఇప్పుడు జార్ఖండ్ యువత పడుతున్న బాధలు , వారి గొంతుకలు ఎందుకు కనిపించడం లేదంటూ నిప్పులు చెరిగారు. జార్ఖండ్ విద్యార్థులపై జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని బాధ్యులను చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశం సమాధానాలను కోరుతోంది. రాహుల్ గాంధీ పార్లమెంటుకు వచ్చి తన ఈ ద్వంద్వ వైఖరిపై సమాధానం చెప్పాలని అన్నారు.






