చెన్నై : డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తను కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం అయి ఉండి బీజేపీకి ఎలా మద్దతు ఇస్తున్నాడో ఏఐసీసీ స్పష్టం చేయాలని అన్నారు. ఇవాళ ఎంపీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు రేవంత్ రెడ్డి ఎందుకు మద్దతు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎంపీ దయానిధి మారన్ విమర్శించారు.
ఒకవైపు రేవంత్ రెడ్డి పునర్విభజన ప్రక్రియకు మద్దతు ఇస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో నాటకాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ, పునర్విభజన ప్రక్రియకు మద్దతు తెలుపడం దారుణమన్నారు. తమిళనాడులో ఎంపీలతో సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ, తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో ఎందుకు సమావేశాలు నిర్వహించ లేదంటూ నిలదీశారు దయానిధి మారన్. తెలంగాణలో పునర్విభజన ప్రక్రియకు మద్దతు ఇస్తున్న రేవంత్ రెడ్డిని ఆ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పునర్విభజన ప్రక్రియపై స్పష్టమైన వైఖరి లేని కాంగ్రెస్ పార్టీకి, తమిళనాడులో దీనిని వ్యతిరేకించే హక్కు లేదన్నారు.





