హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా విద్యుత్ వినియోగం , వాడకంపై సూచనలు చేశారు. ఇవాళ ప్రజా భవన్లో ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా నిరంతరాయంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ఒడిశాలోని నైని గని నుండి రవాణాకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు ఇంధన, ఆర్థిక శాఖలు సమన్వయంతో పని చేయాలని నొక్కి చెప్పారు.
వ్యవసాయం, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధికి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక ఇంధన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. ఎలి నినో ప్రభావం కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని , ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో కొంత ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ తరుణంలో నిరంతరం విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని విద్యుత్ ఉన్నతాధికారులను ఆదేశించారు.





