న్యూఢిల్లీ : తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ గణతంత్ర రాజ్య వ్యవసాయ కార్యదర్శి, ఫిలిప్పీన్స్ క్యాబినెట్ సభ్యుడు అయిన ఫ్రాన్సిస్కో పి. టు లారెల్ జూనియర్తో సమావేశమయ్యారు. బియ్యం ఎగుమతులను పెంచే అవకాశం, అలాగే తెలంగాణ-ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్యాన్ని పెంచే అంశంపై ఇద్దరు నాయకులు కూలంకషంగా చర్చించారు. తెలంగాణ భారతదేశంలోని ప్రముఖ వరి ఉత్పత్తి రాష్ట్రాలలో ఒకటిగా ఆవిర్భవించిందని, అధిక పరిమాణంలో నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయడానికి అవసరమైన ఉత్పత్తి సామర్థ్యం, ఆధునిక రైస్-మిల్లింగ్ మౌలిక సదుపాయాలు, అనుభవం రాష్ట్రానికి ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
కార్యదర్శి లారెల్ ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ నుండి అధిక పరిమాణంలో బియ్యాన్ని సేకరించే అవకాశాన్ని ఫిలిప్పీన్స్ పరిశీలిస్తుందని పేర్కొన్నారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన దిగుమతిదారులు, ఎగుమతిదారులు, రైస్ మిల్లర్ల ద్వారా ఈ ప్రతిపాదనను ఎలా ముందుకు తీసుకెళ్ల వచ్చనే దానిపై ఇరుపక్షాలు చర్చించాయి. దిగుమతి బియ్యం కోసం ఫిలిప్పీన్స్కు ఉన్న గణనీయమైన అవసరం , దాని అంతర్జాతీయ సరఫరా వనరులను వైవిధ్య పరచడానికి చేస్తున్న ప్రయత్నాల దృష్ట్యా ఈ చర్చలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తెలంగాణ పోటీ ధరలు, నమ్మకమైన నాణ్యత , సకాలంలో డెలివరీని అందించ గలదని, తద్వారా ఫిలిప్పీన్స్కు బియ్యం విశ్వసనీయ దీర్ఘకాలిక సరఫరాదారుగా ఎదగ గలదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
తెలంగాణ నుండి మాంసం ఉత్పత్తులు , నాణ్యమైన విత్తనాలను సేకరించడంలో కూడా కార్యదర్శి లారెల్ ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ ఆసక్తిని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాగతిస్తూ, విత్తనోత్పత్తి, ఆహార శుద్ధి మరియు అనుబంధ వ్యవసాయ రంగాలలో తెలంగాణకు బలమైన సామర్థ్యాలు ఉన్నాయని అన్నారు. సంబంధిత అధికారులు , ప్రైవేట్ రంగ ప్రతినిధులతో సంప్రదించి, అందుబాటులో ఉన్న ఉత్పత్తి వర్గాలు, నియంత్రణ అవసరాలను పరిశీలించడం జరుగుతుందని అన్నారు.





