ప్రకటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వచ్చే డిసెంబర్ నెల 8,9వ తేదీలలో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించ బోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన బ్యాంకర్స్ మీటింగ్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బ్యాంకర్లు అందరూ ఇందులో భాగస్వామ్యం పంచుకోవాలని పిలుపునిచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ అనేక ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం, మూసీ పునర్జీవనం వంటి అంశాలను వివరిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షించ బోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్రం వ్యూహాత్మకంగా, వాతావరణం, భాష, భూమి, తక్కువ ధరలకే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, బలమైన విద్యుత్ సరఫరా వ్యవస్థ వంటి అంశాలను వివరించి పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతామని చెప్పారు మల్లు భట్టి విక్రమార్క. బ్యాంకర్లు కార్పొరేట్ సంస్థలతో పాటు స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ మధ్యతరహా, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. ఈ రెండు రంగాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతోపాటు సంపద సృష్టించ బడుతుందన్నారు, తద్వారా జిడిపి పెరుగుతుందని తెలిపారు. ఆత్మ విశ్వాసం, సమిష్టి కర్తవ్యంతో ఒక ఆధునిక, సమగ్ర, భవిష్యత్ తెలంగాణను నిర్మిద్దామని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.






