రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటన
అమరావతి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, గంగపుత్రుల జీవనోపాధి, వారి కుటుంబాల భద్రత కోసం కూటమి ప్రభుత్వం అచంచల కట్టుబాటుతో పని చేస్తోందని తెలిపారు. సముద్రాలు, నదులు, చెరువులు లాంటి ప్రకృతి సంపదలపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న లక్షలాది కుటుంబాల కోసం ప్రభుత్వం సంపూర్ణ కట్టుబాటుతో పని చేస్తోందని చెప్పారు. మత్స్య ఉత్పత్తిని అభివృద్ధి చేయడమే కాక, ఈ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించేందుకు, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
స్థిరత్వం, సమతుల్యత, నాణ్యత ఈ మూడు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టే చర్యల ద్వారానే నీలి విప్లవం నిజ స్వరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో ఆక్వా రంగం మరింత పురోగమించేలా, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. మత్స్యకారుల పట్ల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మాట నిలబెట్టుకుని, వేట నిషేధ కాలంలో గత ప్రభుత్వం ఇచ్చిన రూ.10,000 భృతిని కూటమి ప్రభుత్వం రూ.20,000కు పెంచినట్లు తెలిపారు. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు మొత్తం రూ.259 కోట్ల ఆర్థిక లాభం కల్పించామని పేర్కొన్నారు.





