
భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. శంషాబాద్ లో రూ. 500 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పని చేస్తోంది. ఈ బాధ్యతను హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం, నగరంతో పాటు చుట్టు పక్కల ప్రభుత్వ భూముల కోసం జల్లెడ పడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకుంది. హైడ్రా తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో విలువైన భూమిని స్వాధీనం చేసుకుంది. శాతంరాయ్ గ్రామంలోని సర్వే నంబర్ 17 లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించింది. చుట్టూ నిర్మించిన ప్రహరీని, లోపల ఉన్న షెడ్డులను తొలగించింది.
ఈ భూమిని రాష్ట ప్రభుత్తం 2011 లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డుకు కేటాయించింది. అయితే ఈ భూమి తమదంటూ స్థానికంగా నాయకులుగా చెలామణి అవుతున్న ఓ నాయకుడితో పాటు అనీష్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ క్లెయిమ్ చేస్తోంది. ఈ మేరకు అక్కడ అనీష్ కన్స్ట్రక్షన్ సంస్థ బోర్డులు పెట్టింది. కబ్జాదారులు నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నించడం తో స్థానికులు హైడ్రాకు ఫోటోలను పంపించారు. రాళ్ళు రప్పలతో వ్యవసాయ వినియోగానికి అవకాశం లేని ఈ ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తున్నామంటూ.. అసఫ్ జాహీ పైగా కుటుంబ వారసుల నుంచి కొన్నామంటూ కబ్జాదారులు చెబుతున్నారు. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు కూడా ఇదే సమయంలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. స్థానిక రెవెన్యూ అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించింది.
అనీష్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు చెందిన శ్రీపాద దేశ్ పాండే పలు భూముల వివాదాల్లో ఉన్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఈ అంశాలన్నింటినీ పరిశీలించాక రంగంలోకి దిగింది. స్వాధీనం చేసుకుంది.