ప్రారంభానికి సిద్దమైందన్న హైడ్రా
హైదరాబాద్ : ఎటు చూసినా నివాసాలు.. వరద నీరు ఎటు వెళ్లాలో తెలియని నిర్మాణాలు. కాంక్రీట్ జంగిల్గా మారిన ప్రాంతంలో కూకట్పల్లి నల్లచెరువు ఆక్రమణలకు గురై బిక్కు బిక్కుమంటున్న తరుణంలో హైడ్రా దృష్టి ఆ చెరువుపై పడింది. మురుగు నీటితో దుర్గంధ భరితంగా మారిన ఈ చెరువును అభివృద్ధి చేయాలని హైడ్రా నిర్ణయించింది. 2024 సెప్టెంబరులో ఆక్రమణలు తొలగించినప్పుడు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన సమాచారంతో ఆక్రమణలను తొలగించే పనిని హైడ్రా చేపట్టింది. చెరువలోకి జరిగి ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్డులను హైడ్రా తొలగించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలతో పాటు దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడమే కాకుండా.. 3 మీటర్లకు పైగా మట్టిని కూడా తొలగించింది. అప్పుడు కాని దుర్గంధం దూరమవ్వలేదు. ఇప్పుడు చెరువు విస్తీర్ణం దాదాపు రెట్టింపు అయ్యింది. 16 ఎకరాలకు కుంచించుకు పోయిన చెరువు 30 ఎకరాలకు విస్తరించుకుంది.
ఇదిలా ఉండగా అక్కడ నివాసం ఉన్న వాళ్లే విస్తు పోయేలా కూకట్పల్లి నల్ల చెరువు తయారయ్యింది. బోటు షికారుకు చిరునామా అయ్యింది. హైడ్రా పని తనానికి నిదర్శనంగా నిలిచింది. చెరువు అభివృద్ధిపట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూకట్పల్లి నల్లచెరువును హైడ్రా అభివృద్ధి చేసిన తర్వాత అక్కడి పరిసరాలు ఆహ్లాదంగా మారాయి. 5 కిలోమీటర్ల దూరం నుంచి ఈ చెరువు చెంత సేద దీరేందుకు, వాకింగ్కు, పిల్లలను ఆడించేందుకు వస్తున్నామని సందర్శకులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు నిండితే సులభంగా వెళ్లేందుకు గతంలో ఉన్న ఔట్లెట్లను అభివృద్ధి చేశామన్నారు. మురుగు నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. చెరువులో జీవ వైవిధ్యం ఉండేలా ఐల్యాండ్స్ నిర్మించాం. బోర్లు జీవం పోసుకున్నాయి. చెరువు చుట్టూ దాదాపు కిలోమీటరున్నర పాత్ వే అందుబాటులోకి వచ్చింది. ఆదివారం అయితే ఇది పెద్ద పిక్నిక్ స్పాట్లా మారింది. ఆరోగ్య పరంగా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాం. మల్టీ పర్పస్గా దీనిని తయారు చేస్తున్నామని కమిషనర్ చెప్పారు.





