జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్దరించాలి
అమరావతి : దేశంలో కార్పొరేట్ కంపెనీలకు మోదీ సర్కార్ దోచి పెడుతోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. యూపీఏ హయాంలో తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కావాలని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. దీని వల్ల కోట్లాది మంది పేదలు, కూలీలు, శ్రామికులకు తీరని అన్యాయం జరిగిందని వాపోయారు. ఇదిలా ఉండగా
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట (MGNREGA) పరిరక్షణ యాత్రలో భాగంగా ఇవాళ బాపట్ల జిల్లాకు చేరుకుంది. ఈ సందర్బంగా షర్మిలా రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పరుచూరు నియోజకవర్గం ఇంకొల్లు, చీరాల నియోజక వర్గం కొత్తపేట గ్రామాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమాలకు హాజరైన శ్రామికులు కరువు పనిపై కేంద్రం కుట్రలను తూర్పార పట్టారు.
గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఎన్నడూ 100 రోజుల పాటు పని కల్పించ లేదని, ఏడాదిలో రెండు లేదా మూడు వారాలు పెడితే అదే గగనమన్నట్లు రచ్చబండ దృష్టికి తీసుకొచ్చారు. చేసిన పనికి సైతం వేతనాలు ఎప్పడు పడతాయో గ్యారెంటి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు పనిపైనే బ్రతికే వారి కార్డులు చెప్పాపెట్టకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ తెచ్చిన VB G- RAM G చట్టం వద్దని, YSR హయాం నుంచి అమలు అవుతున్న మన్రేగా పథకాన్ని కొనసాగించాలని, ప్రజల నుంచే డిమాండ్ వ్యక్తం కావడం కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి మరింత బలం చేకూరిందని చెప్పారు షర్మిలా రెడ్డి.





