శాసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ వెల్లడి
అమరావతి : ఏపీలోని ప్రతి పల్లెతో పాటు తాండాలో స్వచ్ఛమైన, శుద్దమైన తాగు నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన ఖర్చు.. 20 నెలల్లో మన ప్రభుత్వం చేసిన ఖర్చు ఒకసారి చూసుకుంటే ఈ విషయం అర్థమవుతుందని అన్నారు డిప్యూటీ సీఎం. సీసీ, బీటీ రోడ్ల కోసం వైసీపీ సర్కార్ రూ. 641 కోట్లు ఖర్చు చేస్తే… కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే రూ. 3853 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
వైసీపీ నాయకులు తమ ఐదేళ్ల కాలంలో 854 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 239 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేస్తే… కూటమి ప్రభుత్వం 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 1331 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించినట్టు స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఐదేళ్లలో వైసీపీ పెట్టిన మొత్తం ఖర్చు రూ. 4610 కోట్లు అయితే… కూటమి ప్రభుత్వం 20 నెలల్లో రూ. 11,506 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నామో ఈ లెక్కలే చెబుతాయని అన్నారు పవన్ కళ్యాణ్. మన దేశంలో ఉన్న కోర్టుల సంఖ్యకు, అక్కడి మౌలిక సదుపాయాలకు, రోజువారీగా నమోదు అవుతున్న కేసుల సంఖ్యకు మధ్య స్పష్టమైన అసమతుల్యత ఉందన్నారు.





