తిరుపతి : నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి దివ్య కల్యాణోత్సవం అత్యంత వైభవంగా, వేదఘోషల మధ్య ఘనంగా జరిగింది. స్వామివారి దివ్య కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తిపారవశ్యంలో మునిగి పోయారు.
ఉదయం 10 గంటలకు ఉత్సవ మూర్తులను కల్యాణ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య విష్వక్సేనారాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్ఠాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళ సూత్రధారణ తదితర శాస్త్రోక్త క్రతువులను అత్యంత వైదిక సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం నక్షత్రహారతి, మంగళ హారతులతో దివ్య కల్యాణ మహోత్సవం ఘనంగా ముగిసింది.
స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించిన భక్తులు “గోవింద… గోవింద…” నామ స్మరణలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించి, స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





