సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు
నంద్యాల జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నంద్యాల జిల్లా డోన్ లో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గత జగన్ రెడ్డి సర్కార్ చేసిన నిర్వాకంపై మండిపడ్డారు. ఆయన నిర్వాకం వల్లనే ఇవాళ ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆరోపించారు. గతంలో నేను ఎక్కడెళ్లినా భూ సమస్యలపై కట్టకట్టలు అర్జీలు వచ్చాయని అన్నారు. వాళ్లు చేసిన ఒక దుర్మార్గాన్ని సరిదిద్దడానికి 20 నెలలు పట్టిందన్నారు. రైతుల సమక్షంలోనే భూ కొలతలు తీసుకుని రైతుల ఆమోదంతో భూ వివరాలతో పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు సీఎం. భూ రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇస్తున్నామన్నారు. క్యూఆర్ కోడ్ విధానం తీసుకొచ్చాం అన్నారు సీఎం. ఎవరు రికార్డులు తారుమారు చేసినా తెలిసి పోతుందన్నారు.
ఎమ్మార్వో, వీఆర్వోలు తప్పు చేసినా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా గుర్తించేలా తయారు చేశామన్నారు సీఎం. మేం ఇచ్చిన పట్టాదార్ పుస్తకాలను ట్యాంపర్ చేయలేరని పేర్కొన్నారు. రూపాయి అవినీతి లేకుండా కొత్త పట్టాదార్ పాసు పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు సీఎం. ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా పట్టా ఇప్పించే బాధ్యత నాదని ప్రకటించారు. రాష్ట్రంలో 16,816 గ్రామాలున్నాయని, 6,860 గ్రామాల్లో సర్వే గత ప్రభుత్వంలో చేశారని తెలిపారు. తప్పుల తడకతో 19.93 లక్షల పుస్తకాలు ఇచ్చారని, రికార్డులు తారుమారు చేసి ఇచ్చారని ఆరోపించారు. అవన్నీ పక్కనపెట్టేసి మళ్లీ కొత్తగా రైతులకు పుస్తకాలు అందిస్తున్నాం అన్నారు.






